టీడీపీ మాజీ మంత్రి అచ్చెనాయుడు కి బిజెపి గాలం వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రణాళికతో ముందుకు సాగుతున్న బీజేపీ నాయకత్వం టిడిపిలో ఉన్న బడా నేతల పై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలోనే వారి కన్ను అచ్చెన్నాయుడు మీద కూడా పడింది. టిడిపి హయాంలో ఓ వెలుగు వెలిగిన అచ్చెన్నాయుడు ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మధ్య మూడు నెలలు జైల్లో పెట్టడం తెలిసిందే. ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి వచ్చి మరీ పరామర్శించడమే కాకుండా ఆయనకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష పదవిని కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఎల్లో మీడియా లో రాయించారు .తద్వారా అచ్చెన్నాయుడు ని కాపాడుకునే ప్రయత్నాలు చంద్రబాబు ఉండగా మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనకు వల విసిరినట్లు కమలనాథులు చెబుతున్నారు.
అచ్చెన్నాయుడు బీజేపీలో చేరుతారా అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం టీడీపీ మీద గుర్రు మీద ఉన్నారని ప్రచారం అవుతోంది. తాను ఇదివరకు అచ్చెన్నను కానని హై కమాండ్ కి తెలియచేస్తారని అంటున్నారు. ఇక బీజేపీలో చేరడానికి అచ్చెన్నాయుడుకు అభ్యంతరాలు ఏవీ లేవని కూడా చెబుతున్నారు. ఇపుడు వైసీపీ వేధింపులు ఎక్కువ అయ్యాయి. టీడీపీ చతికిలపడిపోయింది. చంద్రబాబునుంచి మాటలు తప్ప చేతలు లేవు. ఇక ఏపీలో టీడీపీ సీన్ కూడా కాలినట్లుగానే ఉంది. దాంతో అన్నీ బేరీజు వేసుకుంటే అచ్చెన్నాయుడుకు బీజేపీ సేఫ్ జోన్ అని కింజరాపు కుటుంబ మిత్రులు కూడా అంటున్నారు. అలాగే మోడీ దగ్గర అబ్బాయి రామ్మోహననాయుడుకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపధ్యంలో ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఖరారు చేయించుకుని కాషాయం కండువా కప్పేసుకుంటే మంచిదేనని కూడా ఆయన వర్గంలో వినిపిస్తోందిట.
ఇదే జరిగితే చంద్రబాబు కు అతి పెద్ద షాక్ తప్పదు. అచ్చం నాయుడు అన్నఎర్రన్నాయుడు కుమార్తె భవానీ రాజమండ్రి టిడిపి ఎమ్మెల్యే గాను ,కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ గా ఉండటం తెలిసిందే. అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా వారి వియ్యంకుడే. వీరంతా కలిసి బీజేపీ లోకి వెళ్లి పోతే టీడీపీ పని గోవిందా అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏ విధంగా అచ్చన్నాయుడు ను కాపాడుకుంటారో చూడాలి!