Breaking: శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో పాటు తీవ్ర మైన విద్యుత్ కోతలు, పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్ద ఎత్తున ప్రజలు దేశాధ్యక్షుడి భవనం వద్ద నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుండి శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. ఆందోళనలను అణచివేసేందుకు సైన్యానికి సర్వాధికారులు ఇచ్చారు. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కీలక అధికారులు, మంత్రులు రాజీనామా బాట పట్టారు.
Breaking: గొటబాయ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో..
మరో పక్క రాజకీయ సంక్షోభం ముదురుతోంది. 41 మంది ఎంపీలు అధికార కూటమికి మద్దతు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షడు గొటబాయ రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక ప్రజా ఫ్రంట్ నుండి బయటకు వచ్చేశామని, తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రపాల సిరసేన వెల్లడించారు. వీరితో పాటు సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. దీంతో గొటబాయ సర్కర్ మైనార్టీలో పడింది. ఎమర్జెన్సీ ప్రకటన తర్వార తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా..పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే బసిల్ రాజపక్స స్థానంలో ఆర్ధిక మంత్రిగా నియమితులైన అలి సబ్రి 24 గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. వీటికి తోడు అర్ధిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రధాని రాజపక్స సారధ్యంలోని కేంద్ర కేబినెట్ లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం అర్ధరాత్రి మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సంక్షోమ సంక్షోభం నుండి బయటపడేందుకు కేబినెట్ లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రతిపక్షాలకు పిలుపు నిచ్చినా వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కాబినెట్ మొత్తం రాజీనామా చేసినా అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహింద రాజపక్సలు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ ఎమర్జెన్సీ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 1వ తేదీ విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు.