ఎంపి కావాలన్న కలను సాకారం చేసుకోవడానికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి అగ్రనాయకుడు చలమలశెట్టి సునీల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారంలోనే ఆయన వైసిపి కండువా కప్పుకొ౦టారు.ఇప్పటికే ఇప్పటికి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి మూడు పార్టీల తరపున పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ నాయకుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలు లాభం లేదని రాజ్యసభకు వెళ్లడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా వైసిపి అధిష్ఠానంతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ పొందారని వినికిడి. కాకినాడకు చెందిన చెలమల శెట్టి సునీల్ స్థానికంగా మంచి పేరు ఉన్న నేత. మొదట 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన 2014లో వైసీపీ నుంచి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు.
కాపు వర్గానికి చెందిన సునీల్ కు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా కాపులను ఆకట్టుకోవాలి అన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.ఇప్పటివరకు వైసీపీ 6 రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తే వాటిలో మూడింటిని రెడ్లకు రెండింటిని బిసిలకి ,ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త పరిమళ నత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి దఫా విజయసాయిరెడ్డి ,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు రాజ్యసభ స్థానాల ఇచ్చిన జగన్ తాజాగా అయోధ్యరామిరెడ్డి ,మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాషచంద్రబోస్ ,పరిమళ్ నత్వాని లను వైసిపి తరపున రాజ్యసభకు పంపారు.అయితే ఇప్పటివరకు రెడ్లకు బీసీలకు మాత్రమే ఆయన అవకాశం కల్పించడంపై విమర్శలు ఉన్నాయి.
కాపుల్లో ఈ విషయమై రుసరుసలు కనిపిస్తున్నాయి.మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయానికి కాపులు కూడా దోహదపడ్డారు.అయినా కాపులకు ఆయన ఏమీ చేయడం లేదన్న అసంతృప్తి వారిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీల్ ని రాజ్యసభకి పంపడం ద్వారా కాపులను ఆకట్టుకోవచ్చునని జగన్ భావిస్తున్నట్లు వినికిడి! రోగి కోరింది… వైద్యుడు ఇచ్చింది ఒకటే మందు కావడంతో సునీల్ ఆనందానికి అవధుల్లేవట ఎప్పుడెప్పుడు వైసీపీలో చేరదామా అని ఆయన ఉవ్విళ్లూరుతున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.