విద్యా, వైద్య రంగాల్లో ఏపి ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటీష్ డిప్యూటి హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం గారెత్ విన్ ఓవెన్ .. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిగ్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఓవెన్ బృందం సమావేశమై చర్చించింది. ఆ అంశాలపై సీఎం జగన్ తో ఓవెన్ చర్చించారు. యూకేలో అమలు అవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏపిలో కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బాగుందని మెచ్చుకున్నారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఓవెన్ సీఎంకు వెల్లడించారు.
వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్. బ్రిటీష్ బృందానికి వివరించారు. యూకే – భారత్ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపి నుండి ఎక్కువ మంది విద్యార్ధుకు బ్రిటన్ వీసాలు ఇప్పించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎం జగన్ ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాల్లో ఏపి ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ కు బ్రిటీష్ బృందం హామీ ఇచ్చింది.
ఇదే క్రమంలో వ్యవసాయరంగంలో ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను బ్రిటీషన్ డిప్యూటి హైకమిషనర్ విన్ ఓవెన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సమావేశంలో బ్రిటీషన్ కమిషన్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్ , సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ఆయనను దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేసి జ్ఞాపికను బహుకరించారు.