Bubonic plague: గత ఏడాది చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి భయాందోళనలు వీడకమునుపే కోవిడ్ కంటే ప్రమాదకారి అయిన బుబోనిక్ ప్లేగ్ కేసు ఒకటి తాజాగా చైనాలోని నింగ్జియా హూయ్ రీజియన్ లో నమోదు కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది. ఎలుకలు, పందికొక్కులు, ఈగల ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. ఈ బ్యాక్టీరియా ఉత్యంత ప్రమాదకరమైనదని వైద్య నిపుణుల అంటున్నారు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ప్లేగును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గుర్తించింది.
జస్టీనియన్ ప్లేగుకు కారణమైన యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా 800 ఏళ్ల తరువాత రూపాంతరం చెంది బుబోనిక్ ప్లేగుగా విరుచుకుపడింది. బ్లాక్ డెత్ గా పిలిచే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో యూరప్, ఆసియా, ఆఫ్రికాలను వణికించింది. నాడు ఈ బుబోనిక్ ప్లేగు కారణంగా అయిదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క ఐరోపాలోనే 25 నుండి 60 శాతం మరణాలు చోటుచేసుకున్నాయంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్ తో త్వరగా చికిత్స చేస్తే మరణాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.
గజ్జలు, చంకల, మెడపై కొడి గుడ్ల మాదిరిగా శోషరస కణువులు పెరగడం ఈ బుబోనిక్ ప్లేగు ప్రధాన లక్షణం. మరి కొందరిలో జ్వరం, చలి, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. మరో సారి ప్లేగు వ్యాధి వ్యాపిస్తోందని గత నెలలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.