ఏపీలో ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఏపీకి చెందిన టాప్ మినిస్టర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది.. అనేదే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా ఇచ్చిన నివేదికలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల భద్రతను సమీక్షించే ఇంటెలిజెన్స్ విభాగం.. ఇలా ఓ మంత్రి ప్రాణానికి ముప్పు ఉంది.. అని చెప్పింది అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతున్నది. అది కూడా వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రాణానికి హాని ఉండటం ఏంటి? అసలు ఏపీలో ఏం జరుగుతోందనే విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
మంత్రి కురసాల భద్రతకు ముప్పు ఉన్నందున… ఆయనకు వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. దీంతో వెంటనే ఏపీ హోంశాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ ను కేటాయించింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని హోం శాఖ కన్నబాబుకు కేటాయించాక.. కన్నబాబు తన పర్యటనలన్నింటినీ… బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే చేపట్టాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ఇక.. తన భద్రతకు ముప్పు ఉంది అని తెలియగానే.. కన్నబాబు కూడా అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటనలు చేస్తున్నారు.
అయితే.. కన్నబాబును టార్గెట్ చేసింది ఎవరు? ఆయనది తూర్పు గోదావరి జిల్లా. కాకినాడ రూరల్ నుంచి ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. అయితే.. ఆయనకు మంత్రి పదవితో పాటుగా… విశాఖ జిల్లా ఇన్ చార్జ్ బాధ్యతలను కూడా సీఎం జగన్ కన్నబాబుకు అప్పగించారు.
విశాఖ జిల్లా ఇన్ చార్జ్ గా పలుమార్లు ఆయన విశాఖ జిల్లాను పర్యటిస్తుంటారు. ఈనేపథ్యంలో కన్నబాబును మావోయిస్టులు టార్గెట్ చేసి ఉంటారా? అన్న అనుమానులు బలపడుతున్నాయి. ఒకవేళ మావోయిస్టులే టార్గెట్ చేసి ఉంటే.. ఆయన విశాఖలో పర్యటించే సమయంలోనే ఆయనపై దాడి చేసేందుకు వ్యూహం పన్ని ఉంటారని.. అది ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియడంతో వెంటనే కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేసి ఉంటారు.. అని వార్తలు వస్తున్నాయి.