హత్రాస్ దళిత యువతి హత్యాచర ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలి మరణంపై వివిధ రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి పలు పార్టీలు.
శనివారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రాలు బాదిత కుటుంబాన్ని సందర్శించారు. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరిన రాహుల్, ప్రియాంకలను గ్రేటర్ నోయిడా వద్ద అడ్డుకుని అరెస్టు చేసి వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండవ ప్రయత్నంగా శనివారం రాహుల్, ప్రియాంక ఇద్దరే కారులో బయలుదేరి నేరుగా బయలుదేరి వెళ్లారు. పోలీసుల చర్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాహుల్, ప్రియాంకలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాదిథ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని ప్రియాంక గాంధీ మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
బాధితురాలి మృత దేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు అర్థరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్ పి తో సహా మరో ఇద్దరు పోలీసు అధికారులపై యోగి సర్కార్ వేటు వేసింది. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని సీబీఐ దర్యాప్తు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ దర్యాప్తు వల్ల కూడా తమకు న్యాయం జరగదనీ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలనీ కోరుతున్నారు. ఈ ఘటనను యూపి హైకోర్టు సుమోటో స్వీకరించిన విషయం తెలిసిందే. మరో పక్క 40మంది మహిళా న్యాయవాదులు ఇక్కడి పరిస్థితులను వివరిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?