Maoists: మావోలు తమ ఉనికి తెలియజేయడానికి.. తమ ఆనవాళ్లు పోలీసులకు తెలియజేయడానికి అప్పుడప్పుడు రెచ్చిపోతుంటారు.. కొన్ని అజెండా, ఉద్దేశాలతో అర్ధరాత్రి వేళ అలజడి సృష్టిస్తారు.. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెచ్చిపోయారు. అలజడి సృష్టించారు. ఓ బస్సుని తగులబెట్టారు..!
చింతూరు మండలం కొత్తూరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణికులు వెళ్తున్న బస్సుని నిప్పు పెట్టి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను భయపెట్టి దించేశారు. అనంతరం ఆ బస్సుపై డీజిల్ పోసి నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సును ఆపి దహనం చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులపై నిప్పు రవ్వలు పడడంతో గాయాలైనట్టు తెలుస్తుంది. మావోయిస్టులు దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దహనమైన చోట తమ డిమాండ్లుతో కూడిన కరపత్రాలను సైతం వదిలి వెళ్లారు.
Maoists: భయంతో ప్రయాణికులు..!!
ఒక్కసారిగా పదుల సంఖ్యలో మావోలు వచ్చి.. అరుపులతో బస్సుని ఆపడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కిడ్నప్ చేస్తున్నారేమో అంటూ భయపడినట్టు కొందరు ప్రయాణికులు వాపోయారు. “కాసేపు ఏం జరుగుతుందో తెలియలేదు. అర్ధరాత్రి 12 గంటలు దాటి బస్సులో మేము అందరం నిద్రలో ఉన్న సమయంలో మావోయిస్టులు బస్సును అడ్డగించారు. మేము కిందకు దిగిపోయాము. అనంతరం బస్సుపై డీజిల్ పోసి దగ్ధం చేసారు” అని ప్రయాణికులు తెలిపారు. దీంతో ఈ ప్రయాణికులు వేరే వాహనాలు ఏమి లేకపోవడంతో పక్కనే ఉన్న సర్వేల గ్రామంలో తలదాచుకొని సోమవారం ఉదయం చింతూరుకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతోపాటు దండకారణ్యంలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు.