కరోనా నేపథ్యంలో గత 5 నెలలుగా స్తబ్దుగా ఉన్న స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటోంది. కంపెనీలు నూతన ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్లను తయారు చేసి విడుదల చేస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే 2020 మొత్తంగా చూస్తే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు నష్టం కలిగిందనే చెప్పవచ్చు. కానీ 2021 వరకు అమ్మకాలు మరింత పెరుగుతాయని, ఈ ఏడాది కన్నా 9 శాతం ఎక్కువ స్మార్ట్ఫోన్ అమ్మకాలు 2021లో జరుగుతాయని తెలుస్తోంది. ఈ మేరకు ఐడీసీ (ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) ఇచ్చిన నివేదికలో ఆ వివరాలు ఉన్నాయి.
అయితే 2023 వరకు ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 50 శాతం వరకు 5జి స్మార్ట్ ఫోన్లే ఉంటాయని ఐడీసీ నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతానికి 5జి ఇంకా అందుబాటులోకి రానప్పటికీ అప్పటి వరకు ఆ సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ ఏడాది వరకు మార్కెట్లో 50 శాతం మంది వరకు 5జి ఫోన్లను వాడుతారని ఐడీసీ అంచనా వేస్తోంది. అప్పటి వరకు 4జి స్మార్ట్ ఫోన్ల హవానే కొనసాగుతుందని భావిస్తోంది.
కాగా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 4జి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి, అమ్మకాలు చాలా వరకు తగ్గినా, మరో రెండేళ్లలో అమ్మకాలు పుంజుకుంటాయని, తిరిగి కోవిడ్కు ముందు ఉన్న స్థితికి చేరుకుని దాన్ని దాటి అమ్మకాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. కాగా కరోనా వల్ల ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 9.5 శాతం వరకు తగ్గాయని ఐడీసీ నివేదిక తెలియజేసింది. ఇక అనేక దేశాల్లో మొబైల్ వినియోగదారులు లో ఎండ్ స్మార్ట్ ఫోన్లను వదిలి మిడ్ రేంజ్ ఫోన్ల వైపు చూస్తున్నారని, దీని వల్ల రానున్న రోజుల్లో ఫోన్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే 5జి వచ్చినా.. ఆ టెక్నాలజీ ఉన్న ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ ధరలను తగ్గించినట్లయితే స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలకు లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు మొబైల్ తయారీ సంస్థలు 5జి ఫోన్లను విక్రయిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తక్కువ ధరలకే ఈ ఫోన్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.