నాగార్జునసాగర్ బైపోల్ లో క్యాండిడేట్ను ఎంచుకోవడంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు డైలామాలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ప్రజల నాడి ఏ రకంగా ఉందనేది అర్థంగాక పార్టీ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా సామాజిక, స్థానిక సమీకరణాలు రూలింగ్ పార్టీని బాగా ఇబ్బంది పెడ్తున్నాయి. ఇటీవల కేటీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్లో కూడా జిల్లాలో కొనసాగుతున్న గ్రూపు పాలిటిక్స్ పైనే చర్చించారు తప్ప సాగర్ అభ్యర్థి గురించి కేటీఆర్ ప్రస్తావించలేదు. అయితే ఈ నెల 27, 28 తేదీల్లో సాగర్లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందని మాత్రం ఎమ్మెల్యేలకు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ సభ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం పార్టీ లీడర్లకు ఇవ్వలేదు. అయితే జిల్లా పోలీస్ ఆఫీసర్లు మాత్రం సీఎం రాకకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో కేసీఆర్ రానట్లయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పక వస్తారని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. బైపోల్లో భాగంగా నాగార్జునసాగర్కు ప్రకటించిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వీటితోపాటు పెండింగ్లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ క్వార్టర్స్ గురించి ఈ సభలో క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అంతే తప్పా ఈ సభావేదికగా క్యాండిడేట్ను మాత్రం డిక్లేర్ చేయరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెరాస అతితెలివి వ్యూహం!
ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా చాలా సమయం ఉన్నందున ముందుగానే క్యాండిడేట్ను ప్రకటిస్తే పార్టీకి నష్టం జరగొచ్చని హైకమాండ్ జాగ్రత్త పడుతోంది. అభ్యర్థి విషయంలో లోకల్ క్యాడర్లో ఒకలా, జిల్లా మంత్రి మరోలా, కేటీఆర్ దృష్టిలో ఇంకోమాట ఉన్నట్లు తెలుస్తోంది. వీటిన్నింటిని సమన్వయం చేసుకునేందుకు అధిష్టానం ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ సభ పెట్టి ఇదంతా కొట్టేయాలనే ప్రయత్నం చేస్తోంది. కానీ నియోజకవర్గంలో ఆశావహులు మాత్రం పార్టీ టికెట్ తమకే వస్తదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోముల భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి తదితరులు ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఫంక్షన్లు, చావులు, మీటింగ్లకు పోటాపోటీగా హాజరవుతున్నారు.
ముందంజలో కాంగ్రెస్!జల్లెడ పడుతున్న జానారెడ్డి!
కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి పోటీలో ఉంటారని పార్టీ హైకమాండ్ ఆఫీషి యల్గా డిక్లేర్ చేసింది. దీంతో ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ను బట్టి జానారెడ్డి పోటీలో ఉంటారని, ఆయన సీనియారిటీకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడ్తారని జానా సన్నిహితులు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓవైపు తండ్రి, మరోవైపు కొడుకు నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్నారు. ఆదివారం మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన రఘువీర్ హాలియాలో పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేశారు. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలతో పొలిటికల్గా ఎలాంటి సమస్య రావొద్దనే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ బలంగా ఉండేలా జానారెడ్డి నెట్వర్క్ప్రిపేర్ చేసుకుంటున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
బీజేపీ గూటికి జానా వ్యతిరేకులు!
జానారెడ్డి అభ్యర్థిత్వం డిక్లేర్ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు మెల్లగా బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే హాలియా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జానారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే రిక్కి ఇంద్రసేనారెడ్డి బీజేపీలో చేరారు. ఈయన రాకతో హాలియా, నిడమనూరు, పెద్దవూర మండలాల్లో కాంగ్రెస్పార్టీకి నష్టం తప్పదని అంటున్నారు. ఇదే బాటలో ఆదివారం తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన డాక్టర్ రవినాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంద్రసేనారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ నెల 31 లేదా, ఫిబ్రవరి 1న బీజేపీ ఆధ్వర్యంలో హాలియాలో సభ పెట్టాలని అనుకుంటున్నారు. ఆ టైంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని చెప్తున్నారు. అయితే బైపోల్ అభ్యర్థి ఎవరనే విషయంలో మాత్రం బీజేపీలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్క్యాండిడేట్లు ఫైనల్ అయ్యాకే అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పటికైతే జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదిత, కడారి అంజయ్య పోటీ పడుతున్నారు. హైకమాండ్ వీరిద్దరి పేర్లతో పాటు వలసొచ్చిన వారిలో బలమైన నేతల గురించి కూడా ఆరా తీస్తోంది.