BJP: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన (ఉద్దవ్ థాకరే), తెలంగాణలో టీఆర్ఎస్, బీహార్ లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్ జే డీ దక్కించుకున్నాయి. మహారాష్ట్రలోని అంథేరీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి పోటీ నిలపలేదు. అక్కడ దివంగత ఎమ్మెల్యే సతీమణి పోటీ చేయడంతో ఎన్సీపీతో సహా ఇతర రాజకీయ పక్షాల విజ్ఞప్తితో బీజేపీ అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. దీంతో ఉద్దవ్ శివసేన వర్గానికి చెందిన అభ్యర్ధి రుతుజా లాట్కే భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఒడిశాలోని ధామ్ నగర్, బీహార్ లోని గోపాల్ గంజ్, హరియానాలోని అదమ్ పుర్, ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రానాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో టీఆర్ఎస్, బీహార్ రాష్ట్రం మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ జేడీ అభ్యర్ధి విజయం సాధించారు. ఈ నియోజకవర్గాల్లో ఈ నెల 3వ తేదీ ఉప ఎన్నికలు నిర్వహించగా, ఈ రోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.