పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక పోలీస్ సహా, అయిదుగురు నిరసనకారులు, ఒక అవుతూ డ్రైవర్ ఉన్నారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో సుల్తాన్ అనే నిరసనకారుడు చనిపోయాడు. షాహిద్ అల్వీ అనే ఆటో డ్రైవర్ కి కూడా బులెట్ గాయమై మరణించాడు. ఈయనకు నెలరోజుల కిందటే వివాహమైంది. సోమవారం రాత్రి ఆరంభమైన ఈ హింస వలన చాల ప్రాంతాల్లో రాళ్లు రువ్వుకోవడం, నిప్పు పెట్టడం వంటి చర్యలకు దిగారు. ఢిల్లీలోని జఫారాబాద్, మోజే పూర్, శీలం పూర్, చాంద్ బాగ్ ప్రాంతాల్లో హింస జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి. చాల ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు నిప్పు పెట్టారు. ప్రజలు ఈ హింసకు బిజెపి నాయకులే కారణం అంటూ వారిపై పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ హింస ఘటనలతో అట్టుడుకుతోంది.
ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రెండు రోజులుగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. వేలాదిగా మద్దతుదారులు చేరుకొని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం ఒక వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనల్లో ఉద్రిక్తతలు, హింస ప్రారంభమయింది. రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉందయానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాలకు ప్రజలు, ఆందోళకాకారులు చేరుకోకుండా పోలీసులు గట్టి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేసారు. శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్ర హోమ్ మంత్రి, ఢిల్లీ లెఫ్టీనెంట్ గవర్నర్ లను కోరారు. “ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హింస జరిగిందని తెలిసింది. వెంటనే శాంతి భద్రతలు పునరుద్ధరించాలని నేను అపీల్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేసారు.