కరోనా సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇటీవల కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సడలింపులతో తిరిగి ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లోనూ రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
ప్రయాణికుల డిమాండ్కు సరిపడ సిటీ బస్సు సర్వీసులు అందుబాటులోకి రాలేదు. ఎంఎంటీస్ రైలు సర్వీసులు పరిస్థితి ఇలానే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికమొత్తంలో జనం క్యాబ్ సర్వీసులపై అధార పడుతున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి క్యాబ్ సర్వీసులకు విపరీతమైన డింమాండ్ను సొమ్ము చేసుకోవడానికి ఆ సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఇదివరకటి కంటే రెట్టింపు స్థాయిలో చార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి.
ఇదివరకూ తాము ప్రయాణించిన రూట్లలోని చార్జీలకు ప్రస్తుత చార్జీలకు పొంతన లేకుండా ఉందనీ, రెట్టింపు స్థాయిలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ నుంచి మణికొండకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే, ప్రస్తుత చార్జీ రూ.550 ఉండగా.. ఇదివరకూ అది రూ. 350గా ఉండేది. అలాగే, బంజారాహిల్ప్ నుంచి రామ్ నగర్కు ఇదివరకూ రూ.120 వరకూ చార్జీ ఉండగా.. ప్రస్తుతం రూ.220 వరకూ ఉంటోంది.
తప్పనిసరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే, కొన్ని రూట్లలోనే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే.. సిటీలోని అన్ని దారుల్లోనూ క్యాబ్లు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఇలా చార్జీల బాదుడు వెనుక అసలు కారణం ఇంకోటి ఉంది. అదే డ్రైరన్ ! అంటే ప్రయాణికులు కోరుకున్న చోట దగ్గర్లో క్యాబ్ అందుబాటులో లేదని చెబుతూ..వేరే చోట నుంచి రప్పించి అదనపు చార్జీలు విధిస్తున్నారు. అంటే, దిల్షుఖ్నగర్లో బుక్ చేసుకునే ప్రయాణికుడికి అక్కడి దగ్గర్లో క్యాబ్ అందుబాటులో లేదని కారణంతో ఎల్బీనగర్ లేదా మలక్ పేట నుంచి క్యాబ్ను రప్పిస్తారు.
అంతదూరం నుంచి ఖాళీగా వచ్చినందుకు ఆ మొత్తాన్ని ప్రయాణికులపై మోపుతున్నారు. ఆటోల్లోనూ ఇదే రకమైన దోపిడి కొనసాగుతోంది. అయితే, డ్రైరన్ వల్ల డ్రైవర్లే బలవుతున్నారు. అదనంగా డ్రైరన్ పేరిట వసూలు చేసిన సొమ్ము క్యాబ్ సంస్థలకే వెలుతున్నాయి. ప్రతిరైడ్లోనూ తమ వద్ద నుంచి 25 శాతం కమీషన్ తీసుకుంటున్నారనీ, దీనిని తగ్గించాలంటూ డ్రైవర్లు కోరుతున్నారు. మొత్తంగా చార్జీల బాదుడు వెనుక క్యాబ్ సంస్థల మాయాజాలం స్పష్టంగానే కనిపిస్తోంది.