(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్రం జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు విడుదల చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితి దృష్యా జిఎస్టీ బకాయిలు చెల్లించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు కాగ్ ఆడిటింగ్ తో కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలను కాగ్ తప్పపట్టింది. వస్తు సేవల పన్ను (జిఎస్టీ) అమలులోకివచ్చిన మొదటి రెండు సంవత్సరాలలో రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించిన రూ. 47,272 కోట్ల సెస్ ను కేంద్రం తప్పుగా తమ వద్ద పెట్టుకున్నట్లు కాగ్ పేర్కొన్నది. ప్రభుత్వ ఖాతాలను అడిట్ చేసిన కాగ్ జిఎస్టీ చెల్లింపుల తప్పిదాలను ఎత్తిచూపింది. 2017 నుండి రెండేళ్ల పాటు జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు బదిలీ చేయకుండా కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించిదని తెలిపింది.
2017-18లో 62,612 కోట్ల రూపాయల సెస్ వసూలు కాగా అందులో 56,146 కోట్ల రూపాయలు, 2018-19లో వసూలైన 95,081కోట్ల రూపాయల సెస్ లో 54,275 కోట్ల రూపాయలను నాన్ లాప్సబుల్ నిధికి కేంద్రం బదిలీ చేసిందని కాగ్ తెలిపింది. ఇలా రెండేళ్లలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని తప్పుగా తమ వద్ద పెట్టుకొని కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించినట్లు కాగ్ వెల్లడించింది.