Tirupati Bypoll: టెంపుల్ సిటీలో హోరాహోరీ ప్రచారానికి శుభం కార్డు పడింది.17వ తేదీ తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా గురువారం సాయంత్రం మైకులు బంద్ అయాయి. నెలరోజులుగా తిరుపతి చుట్టూ ఏపీ రాజకీయం తిరిగింది.విమర్శలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు హోరెత్తాయి. సిట్టింగ్ సీటులో గెలుపు సులువే అనే ధీమాలో వైసీపీ ఉంది.ఇక తిరుపతి దక్కించుకుని.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష టీడీపీ,కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-జనసేన పాట్లు పడుతున్నాయి.అన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గెలుపు కోసం తాపత్రయపడుతుంటే.. వైసీపీ మాత్రం మెజారిటీ కోసం చూస్తోంది.
Tirupati Bypoll: ఓటింగ్ పై కరోనా ఎఫెక్ట్?
కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో పోలింగ్ శాతమే విజేతను నిర్ణయించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా.. పోలింగ్ శాతం, చివరి నిమిషం ప్రలోభాలు.. ఇలా ఎన్నో అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువగా పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది. కరోనా ప్రభావంతో ఓటింగ్ శాతం మందకొడిగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా.2014 లోక్సభ ఎన్నికల్లో తిరుపతిలో 77.04,2019 లో 79.76 శాతం ఓటింగ్ నమోదైంది.ఈ ఎన్నికల్లో తిరుపతిలో పదహారున్నర లక్షల ఓట్లు ఉండగా కరోనా కారణంగా ఎంత శాతం పోలింగ్ జరుగుతుందనేది అనుమానాస్పదంగా ఉంది.
పేలిన మాటల తూటాలు!
ఇదిలా ఉంటే.. ప్రచారం సమయంలో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.సవాళ్లు ప్రతిసవాళ్లు సాగాయి .మతాల ప్రస్తావనలు వచ్చాయి. రాళ్ల దాడులు జరిగాయని టీడీపీ గోల పెట్టింది. అభివృద్ధి ఎజెండా అంటూ పలు అంశాలు ప్రచారంలో ప్రభావం చూపాయి.ప్రత్యేకించి టీడీపీ అనేక సందర్భాల్లో వైసిపికే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కి కూడా సవాళ్లు విసిరింది.బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రమాణాలకు రమ్మంటూ సీఎం జగన్ ని లోకేష్ కవ్వించారు.ప్రచారం సమయంలో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లదాడి జరిగిందని మరో సంచలనానికి టిడిపి తెరదీసింది.పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంతా తానై విస్తృత ప్రచారం సాగించారు.ఇక బీజేపీ యథాప్రకారం మతం కార్డును ప్రయోగించింది.వైసిపి అభ్యర్ధి గురుమూర్తి ఇప్పటివరకు తిరుమలేశుని దర్శనం చేసుకోలేదన్న కొత్త పాయింట్ లేవనెత్తి ఆయన మతం ఏమిటంటూ ప్రజల్లోకి సందేహాలు వదిలింది.ఇక బీజేపీ మిత్రపక్షమైన జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ప్రచారానికి రాగలరని పెద్ద హడావుడి జరిగినా ఆఖరి నిమిషాల్లో కరోనా అంటూ ఆయన హోమ్ క్వారంటెయిను కి పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆఖరి నిమిషంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న యోచన విరమించుకుని ఓటర్లందరికీ ఒక్క లేఖ రాసి సరిపెట్టేశారు.జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైసిపి ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొనారు.
పోటీలో హేమాహేమీలు!
వైసీపీ సిట్టింగ్ స్థానం నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు.గురుమూర్తి రాజకీయాలకి కొత్త అయినప్పటికీ ఆయన సాక్షాత్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిజియోథెరపిస్టు కాబట్టి తిరుపతిలో ముఖ్యమంత్రే పోటీలో ఉన్నారు అన్నంత స్థాయిలో వైసిపి ప్రచారం సాగింది. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ పడుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జోష్లో ఉన్న వైసీపీ తిరుపతిలో విజయం చాలా ఈజీ అని భావిస్తోంది. మరోసారి ఓటర్లు తమవైపే ఉన్నారని ఈ గెలుపుతో నిరూపిస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే నిరాశలో ఉన్న టీడీపీ నేతలు గెలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ -జనసేన వ్యూహాలు పనిచేస్తాయని ఆ పార్టీ కూడా అంటుంది. తమ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి అంటూ బీజేపీ ముమ్మర ప్రచారం చెయ్యగా.. గతం కంటే మెరుగ్గా ఆ పార్టీ ఓట్లు రాబట్టుకుంటుందా? అనేది అసలైన ప్రశ్న.తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో… మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో చిత్తూరు జిల్లాలో మూడు.. నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు ఉన్నాయి. రెండు జిల్లాల్లోనూ రాజకీయం రసవత్తరంగా సాగుతోండగా.. సిట్టింగ్ సీటులో భారీ మెజారిటీ లక్ష్యంగా వైసీపీ ప్రచారం చేస్తుంది.