Mudragada: ఆంధ్రప్రదేశ్ కు ‘కులాల కుంపటి’ అనే పేరు ఇప్పటిది కాదు.. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఉంది. పైకి ఎవరూ చెప్పరు. కానీ, వెనుక జరిగేది ఇదే. ఇందులో ముఖ్యమైంది.. కాపులకు రాజ్యాధికారం. ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ.. కాపులకు ప్రాధాన్యం ఉన్న ఏపీలో వారికి రాజ్యాధికారం ఇప్పటివరకూ అందలేదు.
ముద్రగడలో పట్టుదల పెరిగేనా..?
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా కాలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. వంగవీటి రంగా మరణానంతరం రాజకీయాల్లో కాపులకు తరుపు ముక్కగా నిలిచింది ముద్రగడ పద్మనాభం మాత్రమే అని చెప్పాలి. అయితే.. ఆయనలోని రాజకీయ అనిశ్చితి కాపులకు కొంత నష్టమే చూకూర్చింది. అయితే.. ప్రస్తుతం ఆయన తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఏకంగా.. కాపులకు రాజ్యాధికారం రావాల్సిందే.. అంటూ తనదైన వాదనను వినిపిస్తున్నారు. ఈమేరకు ఆయన రాసిన లేఖ ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతోంది.
పార్టీ పెడతారా..?
‘మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి. ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన మన జాతుల వారు ఆలోచనచేయాలి. మన జాతులు జీవితాలు పల్లకీలు మోయడానికేనా..? పల్లకిలో కూర్చోలేమా..? ఇతర గౌరవ, బీసీ, మరియు దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దాము. మనం చేసే ఆలోచనలు, ఆర్బాటాలు, హడావుడి చేయకుండా చాపకింద నీరులాగా భూమి లోపల వైరింగ్ లాగా ఉండాలి. ఇది రాజ్యాంగం కోసం చేసే విప్లవం, శాశ్వత రాజ్యం కోసం. మనం ఎవరికీ వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదు’ అంటూ కాపు, బీసీ, దళితులను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. మరి, ముద్రగడ కొత్త పార్టీ పెడతారా..? భవిష్యత్ ఏపీ రాజకీయంలో సామాజీకివర్గాల సమీకరణాలు రాజ్యాధికారాన్ని అందిస్తాయో లేదో చూడాలి.