హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికుల సుదీర్ఘకాల సమ్మెకు సారధ్యం వహించిన జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన అశ్వత్థామరెడ్డి ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మెను దృష్టిలో పెట్టుకున్న సిఎం కెసిఆర్ ఆర్టిసిలో యూనియన్లు అనే మాటలేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా కెసిఆర్ ఆర్టిసి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వారికి వలాల జల్లు కురిపించారు. కార్మికులు యూనియన్ల పేరు ఎత్తకుండా చేశారు. మరో పక్క యూనియన్ కార్యాలయాలను యాజమాన్యం స్వాధీనం చేసుకున్నది.
యూనియన్ నేతలకు ఉన్న లీవ్ రిలీఫ్ను అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో అశ్వత్థామరెడ్డి ఆరు నెలల పాటు సెలవు కావాలంటూ యాజమాన్యానికి ధరఖాస్తు పెట్టుకున్నాయి. సెలవు అర్జీని యాజమాన్యం క్యాన్సిల్ చేసింది. సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉందనీ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సేవలు అందించాల్సిన అవసరం ఉందనీ అందుకు లీవ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొన్నది. వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.