అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నించింది. ఈ రోజిక్కడ విలేఖరులతో మాట్లాడిన వీహెచ్ పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలోక్ కుమార్ కోర్టు తీర్పు కోసం ఎల్లకాలం వేచి చూస్తూ ఉండే సహనం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలోనే రామమందిర నిర్మాణం జరగాలని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చట్టం తీసుకురావడమొక్కటే మార్గమని ఆయన ఉద్ఘాటించారు. కోర్టు తీర్పు కోసం శాశ్వతంగా ఎదురు చూస్తూ ఉండే ఓపిక, సహనం హిందూ సమాజానికి లేదని అలోక్ కుమార్ అన్నారు.
రామమందిర నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంపై చర్చించేందుకు ప్రయాగరాజ్ లో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 1 వ తేదీవరకూ రెండు రోజుల పాటు ధర్మ సంసద్ పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.