శాసనమండలి అవసరం తీరిపోయింది.శాసనమండలి ఆమోదం తెలపని రెండు బిల్లులకు గవర్నర్ ద్వారా ఆమోదముద్ర వేయించుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి.
అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి.ఈ రెండు బిల్లులను మండలిలో తిరస్కరించినప్పటికీ వేచి చూడాల్సిన గడువు ఈనెల 17 వతేదీతో ముగిసింది. నెల దాటడంతో ఈ బిల్లులు ఆటోమెటిక్ గా ఆమోదం పొందినట్లే. ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే అధికార వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమయినట్లే.శాసన మండలిలో మెజారిటీ కలిగిన టిడిపి ఈ బిల్లులను ఆపాలని చేసిన ప్రయత్నాలన్నీ చట్టంలో ఉన్న ఒక సర్దుబాటు వల్ల విఫలమయ్యాయి.ఇదిలాఉండగా
మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయని ప్రభుత్వం న్యాయస్థానంలోనూ అంగీకరించిందని చెప్పారు. రాజధానుల బిల్లును మండలి పాస్ చేయలేదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్స్ ను పంపడంపై గవర్నర్ ఆలోచించాలన్నారు. దీనిపై గవర్నర్ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు.
ప్రజల అభిప్రాయాలు, లీగల్ అంశాలను కూడా గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీలో కరోనా తీవ్రత ఉంటే ఇప్పుడు మూడు రాజధానుల అంశం అవసరమా? అని యనమల ప్రశ్నించారు. వివాదాస్పదమైన బిల్లులపై గవర్నర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.టిడిపి ఎంత చేసినా రాజధాని మార్పు విషయంలో జగను ప్రభుత్వం దూకుడుకు అడ్డుకట్ట వేయ లేకున్నదనే చెప్పాలి.ఇప్పుడు గవర్నర్ కోర్టులో మూడు రాజధానుల బంతి ఉంది.ఇంతకి ముందు ద్రవ్య వినిమయ బిల్లును కూడా శాసనమండలి ఆమోదించనప్పటికీ గవర్నర్ నెల రోజుల తరువాత ఆమోద ముద్ర వేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు కూడా గవర్నర్ అదే సంప్రదాయాన్ని అనుసరిస్తారని భావిస్తున్నారు