బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి. వాగుల వద్ద వరద ప్రవాహాన్ని గమనించకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో వాహన చోదకులు ప్రమాదానికి గురవుతున్నారు. ఏపిలో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణలో వికారాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద డోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగు ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయింది. వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకువెళ్లడంతో వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. అయితే కారు కొట్టుకుపోయే క్రమంలో ఓ పక్క గట్టు వద్ద ఉన్న చెట్టు అడ్డురావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. కారు నీటిలో మునిగిపోగా దంపతులు ఇద్దరు కారు నుండి బయటకు వచ్చి కొమ్మల ఆసరాగా చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురుస్తుండటంతో వీధులన్నీ జలమయం అయ్యాయి. ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనం కోసం వచ్చన భవానీలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.