కరోనా పాజిటివ్ రోగులు అధికంగా వస్తుండడంతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది దీంతో అక్కడ వైద్య సేవలందించే సిబ్బంది ఉక్కిరి బిక్కిరవుతున్నారు
లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజారవాణా మొదలుకావడంతో తెలంగాణలో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులతో గాంధీ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పరిమితికి మించి రోగులు అడ్మిట్ అవుతుండటంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.మూడు నెలలుగా విరామం లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది శారీరకంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.ఇప్పటికే వైరస్ బారిన పడిన రోగుల్లో 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోవడం గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 200 మంది వస్తుండడ౦తో వైద్య సిబ్బంది అవస్థలు వర్ణానాతీతంగా ఉన్నాయి.గాంధీ ఆస్పత్రిలో వెయ్యి పడకల వరకు మాత్రమే అవకాశముండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని పదిహేను వందలకు పెంచారు.పదిహేను వందల పడకలు కూడా నిండిపోయి ఇంకా కరోనారోగులు వస్తుండడంతో అదనంగా మరో మూడు వందల యాభై పడకల పడకల ఏర్పాటుకు గాంధీ ఆసుపత్రి యంత్రాంగం సిద్ధం అవుతోంది.ఇవి కూడా నిండిపోతే ఏం చేయాలన్న విషయమై ఆసుపత్రి వైద్యులు తర్జన భర్జన పడుతున్నారు.పడకలను పెంచినప్పటికీ అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది కూడా అవసరమే.కానీ అదనపు వైద్య సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది.దీంతో వారు రోగులను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.కరోనా పాజిటివ్ రోగులను వైద్యులు అంటరానివారిగా చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రభుత్వమే కల్పించుకుని గాంధీ ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచడంతో పాటు అదనపు వైద్య సిబ్బందిని కూడా నియమించడం రోగులకు కనీస వసతులు కల్పించటం ఎంతైనా అవసరమంటున్నారు