దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు రోజుకు 20 వేల వరకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసులు అధికం అవుతున్న రాష్ట్రాల్లో జిల్లాలు, ప్రాంతాల వారీగా లాక్డౌన్ లను అమలు చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జూలై 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ లకు పూర్తి అధికారాలు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల తీవ్రత ఆధారంగా ఆంక్షలను విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం కాని కార్యకలాపాలను కఠినంగా కట్టడి చేయాలని పేర్కొన్నది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల నమోదులో మహారాష్ట్రనే అగ్ర స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా నేటి వరకు 5 లక్షల 48 వేల పై చిలుకు కేసులు నమోదు కాగా మహారాష్ట్ర నుండే లక్షా 64 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు ఆయ్యాయి. వీరిలో వైద్య సేవల అనంతరం 86,575 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 7,429 మంది మృతి చెందారు. ప్రస్తుతం 70,607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర తరువాత స్థానంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీలో నేటి వరకు 83,077 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 82, 275 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరువాతే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల జాగ్రత్తపై హెచ్చరికలు జారీ చేస్తూ సూచనలు ఇస్తున్నా చాలా ప్రాంతాలలో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఈ కారణంగా కరోనా మహమ్మారి పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.