కరోనా లోకాన్నంతటినీ చుట్టేసింది. జనంలో భయం పూర్తిగా ఆవహించింది. కరోనా వస్తే ఏమై పోతామా, ఉంటామా.. లేదా, మందులు ఇంకా రాలేదు అనే దశలో కరోనాకు మందులు అంటూ కొన్ని పుట్టుకొచ్చాయి. పోయిన ప్రాణం లేచి వచ్చేంత ఉత్సాహంతో ఈ మందులపై జనాలు విపరీతంగా పడ్డారు. కరోనా ఉన్న వాళ్ళు, లేనివాళ్లు, ఆ లక్షణాలు ఉన్న వాళ్లు కూడా ఈ మందులు కొనుక్కొని ఇళ్లల్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఈ మందులతో దొంగచాటు వ్యాపారం ప్రారంభించారు కొందరు. అలా మందులు మార్కెట్లో లభ్యత తగ్గిపోయి అనధికారికంగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. తాజాగా అటువంటి మందులు మాఫియా ఒకటి బయట పడింది.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న యాంటీ వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది సభ్యులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి
సుమారు రూ.35 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఐదు వేలు విలువ చేసే మందును రూ.40 వేల నుంచి 50 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. సుమారు 40 వేలు ఉండే మందును దాదాపు లక్ష నుంచి లక్షన్నర రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో వీరు విక్రయిస్తున్నారు. వీరు ప్రధానంగా క్వారంటైన్ లో ఉన్న పేషెంట్స్ టార్గెట్ గా వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డిలోని హెట్రో కంపెనీలో తయారవుతున్న మందులను వీరు డాక్టర్ల పేరుతో కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తెలిపారు. వెంకట సుబ్రమణ్యం అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు అయన చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పర్చారు. అనంతరం మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో జైల్ కు తరలించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?