న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 నడుస్తున్నప్పటికీ కేసుల ఉదృతి మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,713 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.130 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,328 (3,156 మృతులు కి చేరింది. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది.
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్లలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,033 కేసులు నమోదు కాగా, పాజిటివ్ కేసుల సంఖ్య 35,000 మార్క్ దాటింది. ఇందులో ఒక్క ముంబయి మహానగరంలోనే 21,000 మందికి కరోనా సోకడం ఆందోళన కల్గిస్తున్నది. తమిళనాడులో 536, గుజరాత్ లో 366, రాజస్థాన్ 305, ఢిల్లీలో 299, మధ్యప్రదేశ్ లో 254, ఉత్తరప్రదేశ్ లో 177, బీహార్ లో 103, ఆంధ్రప్రదేశ్ లో 52, తెలంగాణలో 41 కొత్త కేసులు నమోదయ్యాయి.
మే నెల ప్రారంభం నుంచి దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గత 18 రోజుల్లో సగటున రోజుకు 3,477 చొప్పున కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా మరణాల రేటు 3.1%కి తగ్గగా… కోలుకున్నవారి శాతం 38.29కి పెరగడం మంచి పరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.