ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. రష్యా వ్యాక్సిన్ విడుదల చేసినప్పటికీ మూడు దశల క్లినికల్ ట్రైయిల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదన్న ఆరోపణలు, ఆ వ్యాక్సిన్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ దశలోనే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ వస్తుందని ఐసిఎంఆర్ ప్రకటించింది. కానీ 15వ తేదీ దాటి పోయి నెలాఖరు వస్తున్నా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వస్తుంది అని చెబుతున్నారు. రష్యా వ్యాక్సిన్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదన్న కారణంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వ్యాక్సిన్ తీసుకురాలేదా, మరేమైనా కారణాలు ఉన్నాయా తెలియదు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉన్నా అయిదు కంపెనీలు మాత్రమే మూడవ దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. వీటిలో ప్రధానంగా ఆక్స్ ఫర్డ్ – అస్టాజెనెకా వ్యాక్సిన్, ఫైజర్ బయోన్టెక్, మెడెర్నా వ్యాక్సిన్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తున్నది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్, జైడన్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్ డీ వ్యాక్సిన్ లు ఒకటి రెండు దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వైపే ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ – అస్టాజెనిక అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒప్పందాన్ని భారత్ కు చెందిన ప్రఖ్యాత సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియాతో చేసుకున్నది. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం సమయంలోనే ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ లో 50 శాతం మన దేశానికి కేటాయిస్తామని ప్రకటించింది. అక్స్ ఫర్డ్ – అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు సెప్టెంబర్ లో పూర్తి చేసుకొని డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని
భావిస్తున్నారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తక్కువ ధరకే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
మరో పక్క చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూపు సినోఫార్మ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు మూడవ దశలో ఉన్నాయి. సినోఫార్మ్ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ధర వెయ్యి యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధర రూ.10.800ల వరకూ ఉండవచ్చని సమాచారం. అయితే అమెరికా కు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ రెండు డోసుల ధర సుమారు రూ. 2,800లు వరకూ ఉండవచ్చని తెలుస్తుండగా ఆక్స్ ఫర్డ్ తయారీ వ్యాక్సిన్ ధర అన్ని దేశాల కంటే తక్కువగా రెండు డోసుల ధర రూ.600 వరకూ ఉండవచ్చని తెలుస్తున్నది.