దేశంలో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి పెరిగిపోయింది. పల్లెలు పట్టణాలు తేడాలేకుండా విజృంభన తీవ్రస్థాయికి చేరుకుంది. కరోనా ఆరంభంలో కేవలం మెట్రోపాలిటన్ నగరాలు పరిమితమై ఆ తర్వాత పట్టణాలకు, ఆ తర్వాత చిన్న తరహా పట్టణాలకు పరిమితమైన కరోనా ప్రస్తుతం పల్లెలకు సోకింది. పల్లెల్లో జీవన శైలి దృష్ట్యా విపరీతమైన వ్యాప్తి పెరుగుతోంది. అందుకే పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రపంచంలో కరోనా పట్టికలో దేశం పైపైకి చేరుతుంది. ఇక ఇదే ఉదృతి కొనసాగితే దేశంలో 30 కోట్ల మంది అధికంగా కరోనా బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ విషయంలో అదిగో ఇదిగో అంటూ పిల్లిమొగ్గలు వేస్తుండటం, ఐసీఎంఆర్ కూడా స్పష్టత లేని ప్రకటనలు ఇస్తుండటంతో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య అధికమవుతోంది.
తాజాగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఏమంటున్నారంటే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య సెప్టెంబర్ నెల మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుంది అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, పద్మభూషణ్ ప్రొఫెసర్ కె శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ఆయన పిటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ప్రజలు బాధ్యతాయుతంగా, అత్యంత కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు పాటిస్తేనే సాధ్యమవుతుందనీ పేర్కొన్నారు.
పరిస్థితి ఏమాత్రం బాగోలేదు
భారతదేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందనీ ఐఎంఏ హాస్పిటల్ బోర్డు ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ డాక్టర్ వికే మంగా అన్నారు. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అన్నారు. పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకొస్తున్న వైరస్ ను నియంత్రించడం చాలా కష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సహాయం తీసుకోవాలని అన్నారు. కరోనా వైరస్ కు కళ్లెం పడాలంటే ప్రధానంగా రెండు మార్గాలున్నాయని మొదటిది మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందన్నారు. రెండోది వ్యాక్సిన్ ద్వారా వ్యాధి నిరోధకత సాధించవచ్చని ఆయన చెప్పారు.