Andhra Pradesh: మాజీ ముఖ్యమంత్రి,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు జిల్లాలో కేసు నమోదై ఇరవై నాలుగు గంటలు కాకముందే ఆయన కుమారుడు,మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద అనంతపురం జిల్లాలో కేసు నమోదైంది.ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబుకు ఇచ్చే నోటీసులు రెడీ!
చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ధ్రువీకరించారు. డీపీవోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి కరోనా ప్రమాదకర వేరియంట్ N440K ప్రవేశించిందని.. సీసీఎంబీ కూడా నిర్ధారించినట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది చేసిన ఫిర్యాదు ను పరిశీలించి సీఆర్పీసీ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రేపు ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబుకు సిఆర్ పిసి నోటిసు ఇవ్వడానికి దర్యాప్తు అధికారిగా కర్నూలు ఒకటవ పట్టణ సిఐ హైదరాబాదు కు వెళుతున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప వెల్లడించారు.కరోనా N440K వేరియంట్ ప్రమాదకరమని విమర్శించడం.. భయభ్రాంతులకు గురిచేయడం రెండూ వేరు వేరని.. సీసీఎంబీ కూడా అంత పెద్ద ప్రమాదకరం కాదని నిర్ధారించిందని ఆయన చెప్పారు. ఎవరైనా కరోనాకు సంబంధించి సోషల్ మిడియాలో వదంతులు, అసత్యప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
లోకేష్ పై కేసు ఎందుకంటే?
ఇదిలా ఉండగా మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. అనంతపురంలోని డి.హీరేహల్ లో ఈ కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆరోపణలు చేశారు.టీడీపీ కార్యకర్తపై కర్నాటకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లోకేష్ పై వైసీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని భోజరాజు నాయక్ ఆరోపించారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు.