క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తోడేలు కోసం వల వేస్తాడు.. పులి చిక్కుతుంది..!
కేరళ ఎయిర్ పోర్టులో దొరికిన చిన్న బంగారం ముక్కతో శోధన మొదలెడితే.. సీఎం కార్యాలయం ముఖ్యులు దొరికేసారు..!
అదే కోవలోకి ఇప్పుడున్న చీకోటి ప్రవీణ్ కేసు వచ్చి చేరేలా ఉంది.. క్యాజినో ఆడిస్తాడు, పెద్దలకు ఎంటర్ టైన్ చేస్తాడని మాత్రం చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిల గురించి మొదట్నుండి తెలిసిన విషయం.. కానీ హవాలా డబ్బు దారి మళ్లిస్తాడు.., నల్ల ధనాన్ని దాస్తాడు.., దేశ, విదేశాల్లో హవాలా లావాదేవీలు కొనసాగిస్తాడు.. రాజకీయ, సినీ ప్రముఖుల ద్వారా మొత్తం నడిపిస్తాడు అని మాత్రం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది..! అనధికారికంగా క్యాజినో ఆడడం ఒక చిన్నపాటి అంశమైతే.., దీని పేరిట హవాలా తరలింపు పెద్ద సంచలనంగా మారింది..!
బలయ్యేది టీఆరెస్ నేతలా – వైసీపీ నేతలా..!?
ఇది ముమ్మాటికీ బీజేపీ వేసిన వల.. కొన్నాళ్లుగా బీజేపీపైనా.., నరేంద్ర మోడీపైనా ఒంటికాలిపై లేస్తూ కయ్యానికి వెళ్తున్న కేసీఆర్ ని కంట్రోల్ చేయాలంటే ఆ నేతలను ఒక్కొక్కరినీ బలహీనపర్చాలనేది బీజేపీ పెద్దల వ్యూహం.. ఈ మేరకు బీజేపీ నేతలు తరచూ లీకులు ఇస్తూనే ఉన్నారు. టీఆరెస్ లో ప్రముఖంగా ఉంటూ.. కేసీఆర్ కి సన్నిహితంగా మారిన నేతల్లో ప్రస్తుత మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డిలు ముందు వరుసలో ఉంటారు.. వారిద్దరూ ఈ క్యాజినో కేసులో ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.. ప్రధాన ఆరోపణలతో ఈడీ విచారణలో ఉన్న చీకోటి ప్రవీణ్ వాడుతున్న కారుపై మల్లారెడ్డి స్టిక్కర్ ఉంది.. గత ఏడాది చీకోటి ప్రవీణ్ ఒక నాయక బృందాన్ని రష్యా, శ్రీలంక, గోవా ఇతర జూద దేశాలకు తీసుకుని వెళ్లారు.. ఆ బృందంలో కూడా తలసాని ఉన్నారు అనేది అంతర్గతంగా వినిపిస్తుంది.. సో.. చీకోటి ప్రవీణ్ తో తలసాని, మల్లారెడ్డి లాంటి నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరిగినందుకు.. వీళ్ళ లావాదేవీలు కచ్చితంగా ఈడీకి చేరే ఉంటాయి.. వీళ్ళతో పాటూ మరో నలుగురు టీఆరెస్ నేతలు ఈ కేసులో ఇరుక్కుంటారని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.. ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే.. టీఆరెస్ కోసం బీజేపీ వేసిన వలలో వైసీపీ కూడా చిక్కుకునే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
* క్యాజినో అంటే టీఆరెస్ కంటే ఎక్కువ అనుమానాలు, ఆరోపణలు ఉన్నదీ వైసీపీ నేతల మీదనే.. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో అధికారికంగా (అనధికార) క్యాజినో శిబిరాలు నిర్వహించారు. దీనిలో వల్లభనేని వంశీ, కొడాలి నానీల పాత్ర ఉందని అప్పటి నుండి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆ శిబిరాలు నిర్వహించిన చీకోటి ప్రవీణ్ పైనే ఇప్పుడు ఈడీ వెంటాడుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గతేడాది ఒకసారి రష్యా వెళ్లారు.. సంక్షోభానికి ముందు శ్రీలంక కూడా పలుమార్లు వెళ్లారు.. శ్రీలంక చిక్కుల్లో పడిన తర్వాత నేపాల్ వెళ్లి వస్తున్నారు.. కొడాలి నాని, బాలినేని సహా మరో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఈ తరహా ఆరోపణలు ఉన్నాయి. కొందరి పాత్ర నేరుగా కనిపిస్తుంది.. సో.. టీఆరెస్ కంటే వైసీపీనే ఈ అనధికార వ్యవహారంలో ఎక్కువ ఇరుక్కున్నట్టు కనిపిస్తుంది..
హవాలాలో ఇరుక్కుంటే అంత సంగతులు..!?
క్యాజినో ఆడాలంటే దేశంలో కేవలం గోవాలో తప్ప ఇంకెక్కడా అనుమతులు లేవు. గోవాలో కూడా బిగ్ డాడీ, క్యాజినో ప్రైడ్ అనే రెండు సంస్థల ద్వారా మాత్రమే ఆడిస్తారు.. అందుకే గోవాలో చాలక.. సంక్షోభానికి ముందు శ్రీలంక, ప్రస్తుతం నేపాల్, అప్పుడప్పుడూ రష్యా .., తీరిక ఉంటె కాలిఫోర్నియా కూడా పైన చెప్పుకున్న ప్రముఖులందరూ వెళ్లి వస్తున్నారు.. ఇది క్యాజినోతో ఆగే అవకాశమే లేదు. చీకోటి ప్రవీణ్ హవాలా డబ్బుని మళ్లిస్తారు, దేశం దాటిస్తారు అనే ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తుంది. సో.., అతనితో సన్నిహితంగా ఉంటూ అతని క్లయింట్స్ గా ఉన్న వైసీపీ, టీఆరెస్ ప్రముఖులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఆ ఆరోపణలు నిజమైతే, అతనితో లావాదేవీలు జరిపిన అందరిపై ఈడీ గట్టిగా ఉచ్చు బిగిస్తే ఇది అంతర్జాతీయ నేరంగా కూడా మారుతుంది.. ఆర్ధిక నేరాల కిందకు వస్తుంది. ప్రవీణ్ మళ్లించిన నగదు లెక్కలు.. అవి ఎవరెవరు నుండి అతనికి అందాయి అనే వివరాలు ఆరా తీస్తే.. దీనిలో బలయ్యేది ఎవరు అనేది ప్రస్తుతానికి సందేహమే.. మనీ లాండరింగ్ నేరం కింద జైలుకి వెళ్లాల్సిన పెద్ద కేసులుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా కొందరు నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.. ఢిల్లీతో బాగా డీల్ చేసే నేతలతో టచ్ లోకి వెళ్లి జాగ్రత్తగా బయటపడే మార్గాలు వెతుక్కుంటున్నారట.. అయితే టీఆరెస్ కోసం గట్టిగా వల పన్నిన బీజేపీ పెద్దలు.. అందులో చిక్కుకున్న వైసీపీ నేతలను వదిలేస్తారా..!? పట్టు బిగిస్తారా..!? అనేది మాత్రం ప్రస్తుతానికి సందేహమే..!