(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్: ప్రతినిధి)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టు రికార్డుల కోసం సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలుగా కడపలో తిష్టవేసిన సీబీఐ అధికారులు వందలాది మందిని విచారించారు. అయితే ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులను ఇవ్వాలని సీబీఐ అధికారులు మెజిస్ట్రేట్ను కోరారు. అయితే పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు. రికార్డులు సీబీఐకి అప్పగించేందుకు తమకు ఆదేశాలు లేవని పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.
దీంతో సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తమ దర్యాప్తునకు పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులు ఇచ్చేలా అదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని కొందరు అధికారులకు గత నెలలో కరోనా సోకింది. దీంతో వారి స్థానంలో సీబీఐ ఉన్నతాధికారులు మరో టీమ్ను కడపకు పంపారు. నూతన సీబీఐ టీమ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే వీరు రికార్డుల కోసం హైకోర్టును ఆశ్రయించారు.