(లక్నో నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
హథ్రాస్ దళిత యువతి హత్యాచార ఘటన దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నేడు రంగంలోకి దిగింది. అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి, వెన్నెముక విరిచి అత్యంత పాశవికంగా దాడికి పాల్పడటంతో ఆ యువతి డిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గత నెల 30వ తేదీన యోగి అధిత్యనాధ్ ప్రభుత్వం తొలుత ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసి ఏడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఆ తరువాత మరో పది రోజుల పాటు సమయం కావాలని సీట్ బృందం కోరడంతో గడువు పొడిగించింది. అయితే ఈ కేసులో తొలి నుండి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. మహిళా న్యాయవాదులు నేరుగా సుప్రీం కోర్టుకు లేఖ రాయడం, హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించడం, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడం, ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం నేపథ్యంలో యోగి సర్కార్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
దీంతో సీబీఐ..ఆదివారం హథ్రాస్ నిందితులపై 379 డీ (సామూహిక లైంగికదాడి), 307 (హత్యాయత్నం), 303 (హత్య), ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. సీబీఐ డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సీమా పహుజా నేతృత్వంలో ఫారెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు మంగళవారం బాధితురాలి సొంత గ్రామానికి చేరుకున్నారు. బాధితురాలి సోదరుడితో కలిసి ఘటనా స్థలాన్ని సీబీఐ బృందం పరిశీలించింది. బాధితురాలి తల్లిని కూడా ఘటనా స్థలానికి తీసుకువెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణ అనంతరం అంబులెన్స్లో ఇంటికి పంపించారు.