ఏపిలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన తాజా జీవో పై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్ర, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రహదారులపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు అంటూ ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోవడంతో పాటు ఆ తర్వాత గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం రహదారులపై సభలు, రోడ్ షో లను నిరోధిస్తూ జివో విడుదల చేసింది. అయితే ఈ జీవోకు చట్టబద్దత లేదని, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, వివిధ రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రస్తుతం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షో, బహిరంగ సభలను, త్వరలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న బస్సు యాత్రలను అడ్డుకోవడం కోసమే వైసీపీ సర్కార్ ఈ జీవో తీసుకువచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో దుర్ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, అమరనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ చంద్రబాబు కుప్పంలో ప్రవర్తించిన తీరును విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్దమవుతున్నారు.
ఓ పక్క విపక్షాలు అన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, వైసీపీ బద్ద విరోధిగా గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ .. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ మాట్లాడటం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పులేదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రోడ్లపై సభలు ఏర్పాటు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు గా అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖ అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు చేయడం అధికారుల బాధ్యతగా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో ఒక్క పార్టీకే మాత్రమే అమలు కావని, అధికార పార్టీతో సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని అన్నారు. అలా జరగకుండా ఉంటే అప్పుడు పార్టీలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులో ఎక్కడా సభలు నిర్వహించవద్దని చెప్పలేదనీ, రోడ్లపైన మాత్రమే వద్దని అందులో స్పష్టం చేస్తూ ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిందన్నారు. లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఊతం ఇచ్చేలా ఉండగా, విపక్షాలకు షాక్ ఇచ్చినట్లుగా ఉన్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి.
కుప్పంలో హైటెన్షన్ .. పోలీసులపై చంద్రబాబు ఫైర్.. ట్విస్ట్ ఏమిటంటే..?