Cbi ఎంపీపై సీబీఐ కన్ను పడింది. అక్రమంగా జరిపిన వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో సంచలనం ఖాయమే. డమ్మీ కంపెనీలను సృష్టించి బ్యాంకుల నుంచి లోన్లు పొంది.. అదే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడం కొంతమందికి అందిపుచ్చుకున్న అవకాశం. బ్యాంకులను సులభంగా మోసం చేయడం తెలిసిన వారు మాత్రమే చేయగలిగింది. ఇప్పుడిదే స్కామ్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మెడకు చుట్టుకుంటోంది. డొల్ల కంపెనీలు సృష్టించి భార్య పిల్లల పేరుతో కంపెనీలు సృష్టించారనే అభియోగంపై గతంలోనే ఎంపీపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టు సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. అయితే.. ఇప్పుడీ కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని హైకోర్టు సీబీఐను ఆదేశించింది. అయితే.. ఇలా హైకోర్టు ఆర్డర్లు వచ్చాయో లేదో ఎంపీ గారు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ పొంది భేటీ అయ్యారు.
రెబల్ ఎంపీపై వివాదాలు..
ఎంపీ రఘురామకృష్ణ రాజు అంటే వైసీపీ ఎంపీ అనేకంటే రెబల్ ఎంపీగానే అందరికీ గుర్తొస్తారు. పూర్తి పొలిటీషియన్ కాకపోయినా దాదాపు అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసేసి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇక్కడా ఆయనకు పొసగటం లేదు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేవలం ఆరు నెలల్లోనే అదే పార్టీకి రెబల్ గా మారిపోయారు. రాజకీయ ప్రస్థానం పక్కనపెడితే ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు సహజమే. అయితే.. డొల్ల కంపెనీలు సృష్టించి బ్యాంకులను మోసం చేయడమే విచిత్రం. ఇది రఘురామకృష్ణ రాజు మాత్రమే కాదు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులపై కూడా ఇవే కేసులు నమోదయ్యాయి. సీబీఐతోపాటు ఈడీ కూడా విచారణలు చేస్తూనే ఉంది. వీరందరికంటే ముందు దాదాపు దశాబ్దం క్రితం సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు చేసింది కూడా ఇదే. మేటాస్ కంపెనీతోపాటు అనేక డొల్ల కంపెనీలు పుట్టించి బ్యాంకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టి జైలుకు కూడా వెళ్లారు. ఇలా బ్యాంకులను మోసం చేసిన కేసే ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుపై పడింది.వైసీపీకి దూరంగా.. బీజేపీకి దగ్గరగా..
రెబల్ గా రఘురామకృష్ణ రాజు వైసీపీకి ఎదురెళ్తూనే.. బీజేపీకి దగ్గరవుతున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీకి ఎవరి అవసరం లేకపోబట్టి గానీ.. లేదంటే రఘురామకృష్ణ రాజు ఈసరికే బీజేపీలో చేరిపోయేవారు. సీఎంలతో సహా ఎంతోమందికి దక్కని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. ఇతర బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్లు రెబల్ ఎంపీకి దక్కుతున్నాయి. అంటే.. బీజేపీలో చేరక(చేర్చుకోక)పోయినా ఆయన బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వ్యాపార నిమిత్తం కేసులు కూడా ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చిందే బ్యాంకు రుణాల ఎగవేత కేసు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మొత్తం 826.17 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని రఘురామకృష్ణ రాజుపై అభియోగాలు నమోదయ్యాయి. పలుచోట్ల సోదాలు కూడా జరిగాయి. ఇటివల విచారణ ఆగి.. ఇప్పుడు మళ్లీ మొదలుకాబోతూండడం చర్చనీయాంశంగా మారింది.
Cbi సీబీఐ ఏం చేస్తుందో..
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభిస్తుంది సీబీఐ. అయితే.. దీని చుట్టూ రాజకీయ ప్రమేయం ఉంటుందా అనేదే ఓ ప్రశ్న. ప్రధానితో సహా బీజేపీ నేతలతో రఘురామ ఎలా టచ్ లో ఉంటున్నారో.. అంతకుమించి వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో అంతే స్నేహంగా ఉంటోంది. ఇరు పార్టీల మధ్య ఏపీలో విబేధాలు ఉండొచ్చు కానీ కేంద్రంలోని పెద్దలతో వైసీపీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు పక్కలో బల్లెంలా మారిపోయిన రఘురామపై అందివచ్చిన అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. కేంద్రంపై రఘురామపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఆలోచిస్తే కేంద్రానికి ప్రస్తుతం ఎంపీతో కంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వంతోనే ఎక్కువ అవసరం ఉంటుంది. దేశం అంతా వ్యతిరేకించిన వ్యవసాయ బిల్లును మొదటగా మద్దతిచ్చింది వైసీపీనే. ఆ స్నేహం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో రఘురామ ఈ కేసులో విచారణ వేగవంతం కావడం పెద్ద విషయమేమీ కాదు. మరి.. జరగబోయే పరిణామాలను బట్టి రఘురామకృష్ణ రాజుపై రుణాల ఎగవేత కేసు ఏ మలుపులు తసుకుంటుందో చూడాల్సి ఉంది.