Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన చార్జీషీటులో పలు కీలక అంశాలను పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది. మొత్తం 650 పేజీల చార్జిషీట్ ను కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు. దాదాపు 250 మందిని విచారించగా టి గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి, షేక్ దస్తగిరి నిందితులుగా తేలిందన్నారు.
Viveka Murder Case: సూత్రదారులపై స్పష్టత రావాలి
ఇంకా మరి కొందరి పాత్రపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. నలుగురు నిందితులను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అరెస్టు చేశామనీ, వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో ఉన్నారని వివరించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో నిన్న సీబీఐ అధికారులు ప్రాధమిక చార్జి షీటు దాఖలు చేసిన సీబీఐ అధికారులు నేడు పూర్తి స్థాయి చార్జి షీటును దాఖలు చేశారు. మరో వైపు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత..సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ను తమకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.
తొలుత సిట్ దర్యాప్తు
ఇదిలా ఉండగా… 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి నెలలో కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో గాయపర్చడంతో ఆయన మృతి చెందారు. తొలుత వివేకా గుండెపోటుతో మృతి చెందాడని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయన శరీరంపై గొడ్డలితో నరికిన గాయాలు ఉండటంతో హత్యగా తేల్చారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జగన్ సర్కార్ టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ను తొలగించి కొత్త అధికారులతో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించింది.
250 మందిని విచారించి నలుగురిపై నేరం నిర్ధారణ
అయితే సిట్ దర్యాప్తు పై తమకు నమ్మకం లేదనీ సీబీఐ దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ కేసును సీరియస్ గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. వివేకా ఇంట్లో పని వాళ్లు, సన్నిహితులు, బంధువులు, డ్రైవర్లు, ఇలా 250మందికిపైగా అనుమానితులు, సాక్షులను విచారించి చివరకు ఎర్రం గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి ల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది.