YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలని కోరుతూ సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా రాసిన లేఖపై సీబీఐ దర్యాప్తు చేయలేదని, ఆ లేఖను వెంటనే పోలీసులకు అందజేయకుండా తర్వాత పోలీసులకు అందించారని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పలు మార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వివేకా హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న కేంద్ర ఫొరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్) కు పంపింది. తీవ్ర ఒత్తిడి నడుమ ఆ లేఖను వివేకానే రాసినట్లుగా సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది.
తాజాగా ఆ లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేస్తొంది. లేఖపై వేలిముద్రలను కూడా గుర్తించాలని సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎస్ ను కోరగా, అందుకు నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందని సీఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. అయితే ఈ పరీక్ష జరిగితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని సీఎఫ్ఎస్ఎల్ వెల్లడించిన నేఫథ్యంలో సీబీఐ అధికారుల కోర్టును ఆశ్రయించారు. నిన్ హైడ్రిన్ పరీక్షతో చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశాలు ఉన్న విషయాన్ని ముందుగానే కోర్టుకు తెలియజేశారు.
లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చడం ఈ కేసుకు చాలా ముఖ్యమని, లేఖపై నిన్ హైడ్రిన్ టెస్ట్ కు అనుమతించాలని కోర్టును కోరారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలి ముద్రలతో పోల్చాల్సి ఉందని తెలిపారు. కోర్టు రికార్డుల్లో ఒరిజినల్ లేఖకు బదులు కలర్ జిరాక్సు ను అనుమతించాలని కోరారు. సీబీఐ తాజా పిటిషన్ నేపథ్యంలో కోర్టు నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్ పై జూన్ 2న విచారణ జరపనున్నది.
చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించిన సీఎం జగన్