ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
2012-18 మధ్య 705 కోట్ల రూపాయలను అక్రమంగా వాడుకున్నారని ఎఫ్ఐఆర్ లో సీబీఐ పేర్కొన్నది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు బుధవారం ముంబయి, హైదరాబాద్లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు, ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లోని పలు కార్యాలయాలతో సహా మొత్తం ఆరు ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. ఈ సోదాలు కొనసాగనున్నాయి.
కేసు విషయానికి వస్తే.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఈఎఎల్) అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే గ్రూప్ ప్రమోటర్గా ఉన్న జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరి కొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ సంస్థ. ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోస దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జీవీకే ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం ఉన్నది. ఈ వెంచర్ సంస్థపై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సీబీఐ గుర్తించింది.