ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మీద ఏపీ సర్కార్ ఫుల్ గా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఆర్ధిక లావాదేవీల పై విచారణ కమిటీలను నియమిస్తూ, అందులో ఎమన్నా అవినీతి జరిగిందేమోనని జగన్ ప్రభుత్వం భూతద్దంలో వెతుకుతున్న విషయం చూస్తూనే ఉన్నాం.
అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేబినేట్ సమావేశంలో చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, అదే విధంగా ఫైబర్ నెట్ వంటి వాటి మీద సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.ఇది జరుగుతుండగానే టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్సై కుంభకోణంలో అరెస్టు చేశారు.ఇది నూటయాభై కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం ఈ కేసును కూడా సిబిఐ విచారణకి అప్పగించవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ప్రభుత్వం ఆరోపిస్తున్న విధంగా అంత పెద్ద అవినీతి జరిగి ఉంటే, సిబిఐ సిబిఐ చేత దర్యాప్తు చేయిస్తే ఇంకా బాగుండేది, ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేవి కావని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసును ఎసిబి విచారణకు ఆదేశించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అధికార వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ఇక ఈ వ్యవహారంలో కేంద్రం పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే కేంద్రంకి సంబంధించిన వ్యవస్థ ఈఎస్ఐ. మరి అలాంటి వ్యవస్థ మీద సిబిఐ విచారణ అయితే బాగుంటుంది అనేది చాలామంది భావన . దీనిలో కేంద్ర ప్రభుత్వ అధికారుల జోక్యం కూడా ఉండవచ్చు.. సిబిఐ విచారణ అయితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా అని వారు అంటున్నారు!మరి ఇంకా దీని మీద ఎంత వేగంగా విచారణ చేస్తారు అనేది తేలాలి.