ఏపీలో సంచలనంగా మారిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమనే ప్రచారం తెరమీదకు వస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పోలీసుల దర్యాప్తు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం (సిట్) విచారణ అనంతరం ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల విచారణ వేగంగా కొనసాగింది. అయితే, ఆ తర్వాతి పరిణామాలే అనేక మందిలో చర్చకు కారణంగా మారాయి.
కపడలోనే అసలు విషయం…
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు మార్చి నెలలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ బృందం కడప చేరుకుంది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురైన ఆయన నివాసాన్ని పరిశీలించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను విచారించారు. సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికలను పరిశీలించింది.
ఆమెను విచారిస్తేనే….
దీంతో పాటుగా వైఎస్ వివేకా కూతురు సునీతతో కలిపి, వేరుగా వంటమనిషి లక్ష్మీదేవిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో అరెస్టు అయి బెయిల్పై వచ్చిన లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్ను కూడా వివేకా ఇంట్లో సీబీఐ పలు వివరాలు ఆరా తీసింది. మరోమారు అనేక దఫాలు వివేకా కుమార్తెను సీబీఐ విచారించడంతో ఈ కేసులో ఆమె విచారణ కీలకంగా మారవచ్చని ప్రచారం జరిగింది.
బహిరంగంగా కాల్చి చంపేయమన్నారు
మరోవైపు విచారణ సమయంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయనకు `సిట్` నోటీసులు జారీ చేసింది.. అయితే, ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి… దీంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆదినారాయణరెడ్డి వివేకా హత్య కేసులో .01 శాతం నా పాత్ర ఉన్నా పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని ప్రకటించారు. నాది తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇప్పుడే అసలు ట్విస్ట్
ఇలా రాజకీయంగా కలకలంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు నేటికి కూడా వివేకా హత్యపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఇంత శరవేగంగా దర్యాప్తు ప్రక్రియ కొనసాగించినప్పటికీ, అనంతరం చర్యలు లేకపోవడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే, సీబీఐ తన విచారణను దాదాపుగా పూర్తి చేసిందని, త్వరలోనే మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టనుందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎంట్రీలో సీబీఐ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాలు తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.