ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన నోటీసు మేరకు లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా కవితను విచారించిన అధికారులు .. మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం దాదాపు ఏడుగంటల పాటు కవితను విచారించిన సీబీఐ అధికారులు .. ఆమె కు మరో నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం తమకు కావాల్సిన అధారాలను సమర్పించాలని సూచించినట్లుగా తెలుస్తొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వివరాలు (ట్రావెల్ హిస్టరీ), విమాన వివరాలు, చార్టెడ్ ఫ్లైట్స్ ఉపయోగిస్తే వాటి వివరాలు అందజేయాలని సదరు నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. ఆదివారం విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మరో మారు విచారిస్తామని సీబీఐ అధికారులు తెలియజేసినట్లు తెలుస్తొంది.
ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాల అధారంగా సీబీఐ అధికారులు కవితను దాదాపు 40 నుండి 50 ప్రశ్నలు వేశారనీ, వాటిలో కొన్నింటి సమాధానాలు ఇచ్చిన కవిత, ఎక్కువ శాతం ప్రశ్నలకు తనకు తెలియదు అని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీబీఐ అధికారుల విచారణ ముగిసిన వెంటనే కవిత.. ప్రగతి భవన్ కు చేరుకుని తన తండ్రి, సీఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు. ఇంతకు ముందు సీబీఐ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన సమయంలో మోడీ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేసిన కవిత.. విచారణ ముగిసిన తర్వాత గానీ, మరో సారి నోటీసులు ఇవ్వడంపై గానీ మీడియా ముందు ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ప్రస్తుత పరిణామాలపై మరో మారు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. ఈ వ్యవహారంలో తదుపరి ఎలా ముందుకు వెళతారు అనేది వేచి చూడాలి.