(బెంగళూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ ఇంటిపైనా, ఆయన కార్యాలయాలపైనా సీబీఐ అదికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతికి సంబంధించి కర్నాటక, ముంబాయి ఇతర ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ దాడులు నిర్వహించింది. మొత్తం 14 ప్రదేశాలలో ఈ సోదాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ నెలలో డీకె శివకుమార్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా శివ ప్రసాద్ నివాసంలో సీబీఐ సోదాలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. “సీబీఐ ఈడీ లాంటి పెంపుడు సంస్థలను అడ్డుపెట్టుకొని మోడి – యడియూరప్ప ప్రభుత్వ చేస్తున్న ఇలాంటి దాడులు మమ్మల్ని భయపెట్టలేవు, ఇలాంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నటికీ తలవంచరు. వీటితో ప్రజల కోసం మేం చేసే పోరాటం మరింత బలపడుతుంది” అని సుర్జీవాలా పేర్కొన్నారు.
కర్నాటకలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకే బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సంసిద్ధం కాకుండా దెబ్బతీసేందుకు శివకుమార్ నివాసంపై సీబీఐ దాడులు చేయించారని సిద్దరామయ్య ఆరోపించారు.