CBI: ప్రకాశం జిల్లా పై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇప్పటికి రెండుసార్లు జిల్లాలో సీబీఐ దాడులు నిర్వహించింది. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ను సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర మోసం చేసిన జిల్లాకు చెందిన తేర్షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఆ కేసు విచారణలో భాగంగా జనవరి ఆరో తేదీన సీబీఐ ప్రకాశం జిల్లాలో సోదాలు నిర్వహించింది.
CBI: బెల్లం కోటయ్య కంపెనీలపై దాడులు!
తేర్షేర్ ప్రైవేట్ కంపెనీ ఛైర్మన్ బెల్లం కోటయ్య, జయంత్ బాబులతో పాటు బీకే ఎక్స్పోర్ట్, మహి అగ్రో కంపెనీ, విజయ ఏరో బ్లాక్స్ లోనూ సోదాలు చేసింది. మొత్తం పది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నర్రా ప్రసన్న కుమార్తో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.
CBI: వెలుగులోకి వచ్చిన ఈపీఎఫ్ కుంభకోణం
ఇక ఫిబ్రవరి నెలలో రెండు రోజుల క్రితం కూడా మళ్లీ జిల్లాలో సీబీఐ దాడులు జరిగాయి.ఈసారి ఈపీఎఫ్ కుంభకోణంపై అందిన ఫిర్యాదుల మేరకు సిబిఐ మెరుపుదాడులు చేసింది.మద్దిపాడులో బొమ్మిడాల కంపెనీకి సంబంధించిన మాజీ అకౌంటెంట్ పడాల శ్రీనివాసరావు గృహంలో సోదాలు నిర్వహించారు.
క్లూస్ ఇచ్చిన బొమ్మిడాల కంపెనీ!
తమ కంపెనీ కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో అవకతవకలు జరిగాయని బొమ్మిడాల కంపెనీ ఫిర్యాదు చేయగా సీబీఐ రంగంలోకి దిగింది.గుంటూరులోని ఇపిఎఫ్ కార్యాలయంలో ఉన్నతాధికారిని వారు అదుపులోకి తీసుకొని రాబట్టిన సమాచారం మేరకు శ్రీనివాసరావు నివాసంపై దాడులు నిర్వహించారు. ఆ కంపెనీ ఉద్యోగుల పీఎఫ్ లావాదేవీలన్నీ శ్రీనివాసరావే చూసినట్లు సీబీఐ దాడుల్లో ధ్రువపడింది.కీలకమైన సాక్ష్యాధారాలు కూడా దొరికాయి.
చీరాలలో కూడా దాడులు?
తదుపరి శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో చీరాలలో కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ నివాసంలో సోదాలు జరిపినట్లు సమాచారం అయితే ఉంది కానీ దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు.స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సిబిఐ అధికారులు నేరుగా దాడులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ కుంభకోణం ఎలా జరిగిందంటే?
గుంటూరు ఇపిఎఫ్ కార్యాలయం అధికారులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కార్మికుల ఖాతాలనుగుర్తించి ఆ డేటాను ప్రైవేటు కన్సల్టెన్సీలకు ఇవ్వగా వారు నకిలీ ఖాతాలు సృష్టించి ఆయా లబ్ధిదారుల ఖాతాల నుండి లక్షలు కాజేసి అందరూ పంచుకున్నారు.సీబీఐ తరచూ దాడులకు వస్తుండటంతో జిల్లాలో అలజడి మొదలైంది.