రాష్ట్రంలో సంచలనంగా రేపి.. ఇప్పటికీ మిస్టరీగా మారిపోయింది వైఎస్ వివేకా హత్య కేసు. ఈ హత్య జరిగి 18 నెలలు కావొస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. సిట్ విచారణ జరిపి 1400 మందిని విచారించి ఓ కొలిక్కి తీసుకొస్తున్న దశలో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణ మొదలుపెట్టి ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ కేసు కీలక దశలో ఉంది. దీనిపై ఈ వారంలోనే కొన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.
పెరుగుతున్న అనుమానితుల జాబితా..
వివేకా హత్య కేసులో రోజురోజుకీ అనుమానితుల జాబితా పెరుగుతోంది. సిట్ విచారణ సందర్భంగా దాదాపు 1800 మందిని అనుమానితుల జాబితా సిద్ధం చేసి విచారణ చేశారు. ఆపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి 11 మందిని ప్రధాన అనుమానితులుగా పేర్కొంటూ హైకోర్టులో పిల్ వేసి సీబీఐ విచారణ కోరారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీబీఐ అనుమానితులను విచారించింది. ఈ నేపథ్యంలో వివేకా ఇంటి వాచ్ మేన్, ఇంట్లో పనిమనుషులు, మరో ఇద్దరు మహిళలను, స్థానిక సీఐ.. ను కూడా విచారణ చేపడుతోంది. వీరి నుంచి సమాచారం రాబట్టి నిందితుల పేర్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది సీబీఐ.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ..
ఈ హత్య కేసు సీబీఐకే సవాల్ గా మారింది. మొదట ఇద్దరు అధికారులతో దర్యాప్తు చేయగా ఇప్పుడు 10 మంది పెరిగారు. పులివెందుల నుంచి ముగ్గుర్ని పిలిచి కడప సెంట్రల్ జైలులో విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు రెండు రోజుల ముందు వివేకా ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. కీలకమైన ఆధారాల కోసం నిరీక్షిస్తున్నారు. పులివెందుల కోర్టులో కొన్ని పత్రాల కోసం పిటిషన్ పై న్యాయస్ధానం తమకు అధికారం లేదని చెప్పగా అధికారులు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.