CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలను విడుదల చేసింది. ఈ పలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లేదా cbse.gov.in ద్వారా చూడవచ్చు. దాంతో పాటు డిజిలాకర్ యాప్ లో ఫలితాలను వీక్షించే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు ఫలితాలు పొందేందుకు తమ రోల్ నెంబర్ తో పాటు స్కూల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పరీక్షలు రద్దు చేయడంతో మెరిట్ లిస్ట్ ను ప్రకటించలేదు. డిజిలాక్ లో స్కోర్ కార్డును పొందవచ్చు. ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను బోర్డు వెల్లడించింది. రికార్డు స్థాయిలో 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. అలాగే ఢిల్లీలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపింది.
మొత్తంగా 70,004 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించగా, 1,50,152 మంది విద్యార్థులు 90 శాతం పైగా మార్కులు సాధించినట్లు బోర్లు పేర్కొంది. ఇక పోతే కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎన్ఏ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపింది. ఇంకా 65,184 మంది విద్యార్థుల ఫలితాలు వెయిటింగ్ లో ఉన్నాయనీ, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు.