CC Road disappeared: పలు గ్రామ పంచాయతీల్లో చిత్రాలు, విచిత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. మరి కొన్ని వెలుగులోకి రావు. గ్రామాల్లో కొందరు తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఉంటారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, సర్పంచ్ లు ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కు అయి పలు అక్రమాలకు పాల్పడుతుంటారు. రోడ్డు వేయకుండా వేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు కైంకర్యం చేస్తుంటారు. అవి ఎప్పుడో ఒక సారి నిజాయితీ గల అధికారి తనిఖీకి వచ్చిన సందర్భంలోనో లేక కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు రికార్డులు పరిశీలించినప్పుడో వెలుగులోకి వస్తుంటాయి.
ఓ సినిమాలో పోశాని కృష్ణమురళి తన చేపల చెరువును దొంగలు ఎత్తుకు పోయారు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చాలా మందికి గుర్తే ఉండి ఉంటుంది. అదే విధంగా ఓ గ్రామంలో మా ఊళ్లో రోడ్డు మాయం అయ్యింది అంటూ ఫిర్యాదు రావడం అక్కడి అధికారులను అవాక్కు అయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీదీ జిల్లాలో నమోదు అయిన ఓ పోలీస్ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తమ గ్రామంలో నిర్మించిన కిలో మీటరు మేర రోడ్డు దొంగతనానికి గురైందంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కల్గించింది.
విషయంలోకి వెళితే.. సీదీ జిల్లాలోని మేద్రా గ్రామంలో 2017లో మట్టి రోడ్డు నిర్మించారు. ఆ తరువాత ఆ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ది చేసినట్లు రికార్డుల్లో చూపారు. పంచాయతీ రికార్డులో సిమెంట్ రోడ్డు వేసినట్లుగా ఉండి, గ్రామంలో అక్కడ సిమెంట్ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఈ విధంగా ఫిర్యాదు చేశారు. రోడ్డు దొంగతనం గురించి విన్న పంచాయతీరాజ్ అధికారి ప్రజాపతి ఆశ్చర్య పోయారు. ఇలాంటి ఘటన గురించి తాను మొదటి సారి వింటున్నానని పేర్కొన్నారు. రోడ్డు దొంగతనం అనడం సరైంది కాదని పేర్కొన్న ఆయన తాను కొత్తగా ఇక్కడికి బదిలీ పై వచ్చాననీ, దీనిపై పూర్తి సమాచారం లేదన్నారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రహదారి నిర్మించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే రోడ్డు నిర్మించినట్లు బిల్లులు చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఎవరి హయాంలో ఈ అవినీతి జరిగింది. అప్పటి అధికారులు ఎవరు అనేది తేలనున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?