ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ వైరాల కారణంగా ఇవిఎంలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్తో సహా దేశంలోని దాదాపు 20 రాజకీయపక్షాలు ఇవిఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సైబర్ నిపుణుడిగా చెప్పుకుంటున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి లండన్లో మీడియా సమావేశం నిర్వహించి, 2014 ఎన్నికలలో ఇవిఎంలను బిజెపి తరపున హాకింగ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రకటన దరిమిలా బ్యాలెట్ పత్రాల పద్ధతికి తిరిగి వెళ్లాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే షుజా చెప్పిన సంగతులలో దేనికీ ఆధారాలు దొరకడం లేదు. ఆయన తన కథనంలో పేర్కొన్న వ్యక్తులు అందరూ అలాంటి వ్యక్తి తమకు తెలియనే తెలియదని అంటున్నారు.
గురువారం సునీల్ అరోరా ఒక సమావేశంలో మాట్లాడుతూ, బ్యాలట్ పేపర్ల పద్ధతికి తిరిగి వెళ్లే సమస్యే లేదని అందరికీ స్పష్టంగా చెబుతున్నా అన్నారు. బ్యాలట్ పత్రాలను దౌర్జన్యకారులు ఎత్తుకువెళ్లే రోజులు మళ్లీ తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ‘ఎలాంటి విమర్శనయినా, సూచనలనయినా వినేందుకు మేము సిద్ధం. బెదిరిస్తే మాత్రం లొంగేది లేదు’ అని సునీల్ అరోరా వ్యాఖ్యానించారు.