హైదరాబాద్: ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఏపీలో ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిపికేషన్ (సిబిఎఫ్సి) వర్మకు తెలియజేసింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది.
సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం అక్రమమని, చట్ట విరుద్ధమని వర్మ వాదిస్తున్నారు. సెన్సార్ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వర్మ ఒక ప్రకటన విడుదల చేశారు.
సినిమా చూడకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని వర్మ ప్రశ్నిస్తున్నారు. సినిమా చూడకుండా దానికి సర్టిఫికెట్ ఇవ్వడాన్ని వాయిదా వేసే హక్కు సెన్సార్ బోర్డుకు లేదని వర్మ అన్నారు. ఇలా చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు.
ఈ నెల 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వర్మ ఏర్పాట్లు చేశారు. త్వరలో కడపలో ఒక బహిరంగ సభలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ నిన్న ప్రకటించారు.
అన్నీ నిజాలే చెబుతానంటూ వర్మ ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలతో సంచలనం రేపాడు. దీంతో టిడిపి వర్గీయులు కొందరు ఈ సినిమాను విడుదలచేయకూడదంటూ కేసులు పెట్టారు. మొన్నటికి మొన్న ‘లక్ష్మీస్ ఎన్టిఆర్’ చిత్ర విడుదలను నిలిపివేయాలని కోరుతూ టిడిపి కార్యకర్త దేవీబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాడు. సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటివ్గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని దేవీబాబు అభ్యంతరం తెలిపారు. ఏప్రిల్ 11 వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆయన ఈసీని కోరాడు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా వర్మ కచ్చితంగా ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తా అని ప్రకటించాడు. కుదరకపోతే యూట్యూబ్లో అయినా పెట్టేస్తా అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో..?