Cabinet Decisions: పార్లమెంట్ సభ్యులకు ప్రధాన మంత్రి (prime minister) మోడీ (modi) గుడ్ న్యూస్ అందించారు. కరోనా (covid) నేపథ్యంలో రెండేళ్లుగా పార్లమెంట్ సభ్యుల (MP) స్థానిక అభివృద్ధి నిధుల (ఎంపీ ల్యాడ్స్) పథకాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meet)లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశం ఎంపీ ల్యాడ్స్ పునరుద్దరించాలని నిర్ణయించింది. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మిగిలిన కాలానికి నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
Cabinet Decisions: కేబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు ఇవీ..
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల చొప్పున ఏకమొత్తంలో ఎంపీ ల్యాడ్స్ విడుదల.
ఎంపీ ల్యాడ్ కేటాయింపు 2025 – 26 వరకూ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం. పెట్రోల్ లో కలిపేందుకు వినియోగించే ఇథనాల్ కు చెల్లించే ధర పెంపు, చెరుకు నుండి తీసిన ఇథనాల్ కు రూ.1.47 చొప్పున అదనంగా చెల్లింపు. ప్రస్తుతం చెరుకు నుండి తీసిన ఇథనాల్ కు లీటరుకు రూ.62.65 లు చెల్లిస్తుండగా ఇకపై రూ.63.45 లు చెల్లించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి పెంచిన ధర అమల్లోకి వస్తుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మొత్తానికే ఇథనాల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ లో ఇథనాల్ ను 8 శాతం మేర కలుపుతున్నామనీ, వచ్చే సంవత్సరానికి ఇది పది శాతానికి చేరుకుంటుందని మంత్రి తెలిపారు. 2025 నాటికి 20 శాతం మేర ఇథనాల్ ను పెట్రోల్ లో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మిక్సింగ్ తో అడు చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఇటు చెరకు రైతులు, చెరకు మిల్లలకు మేలు జరుగుతుంది.