కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టాలను సాకుగా చూపి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను ఎగవేయడానికి సిద్ధం అయింది. జూలై 2017లో దేశంలో జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం చేసిన సమయంలోనే పలు రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించగా రాష్ట్రాలకు తమ తమ రాబడిలో 14శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆ మేర పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించే లాగున ఒప్పందం జరిగింది. ఈ పరిహారాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లించడానికి కేంద్రం అంగీకరించడంతో రాష్ట్రాలు సమ్మతించాయి. అనంతరం జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చింది.
2022 జూలై వరకు రాష్ట్రాలకు కేంద్రం జిఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సి ఉండగా, ఐదేళ్ల కాల పరిమితిని మూడేళ్ళకు కుదించి పూర్తిగా దీనికి మంగళం పాడే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. అయితే జీఎస్టీ పరిహారం చెల్లింపుల కాలపరిమితి తగ్గించాలన్నా పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించే పరిస్థితిలో లేదని కేంద్రం చేతులు ఎత్తేసింది. జిఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటా చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద నిధులు లేవని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.
కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రాలకు భారీగా ఆదాయం తగ్గిపోయింది. మరో పక్క వైద్యం, సంక్షేమ పధకాలకు ఖర్చు భారీగా పెరిగింది. అప్పులు చేస్తే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో కేంద్రం జిఎస్టీ బకాయిల చెల్లింపులు చేయలేమని ప్రకటించడం రాష్ట్రాలకు ఆందోళన కల్గిస్తోంది.