పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నాబార్డ్ నుండి 2,234.28 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. ప్రాజెక్టు నిధుల కోసం గత నెలలో ప్రధాన మంత్రి మోడీ కి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. పెండింగ్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి చేసిన నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. కేంద్రం నుండి పెండింగ్ నిధులు విడుదల కావడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్ళీ ఉపందుకొనున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పై ఏపీ ప్రభుత్వం గతం లోనే అన్ని వివరాలను కేంద్ర జల శక్తి శాఖకు అందజేసింది. అయితే నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో సీఎం జగన్ ప్రధానమంత్రి మోడీ కి లేఖ రాయడం, రాష్ట్రానికి విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలువురు పోలవరం పెండింగ్ నిధులకు సంబంధించి వినతి పత్రాలు అందజేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జల శక్తి శాఖ పి పి ఎ పూర్తి చేయడంతో నిధుల విడుదలకు మార్గం సుగమం అయింది.
ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు రియంబర్స్మెంట్ కింద ఎన్ డబ్ల్యూ డి ఎ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెరిచిన ప్రత్యేక ఖాతాలో నిధులు జమ చేయనున్నది. రెండు మూడు రోజుల్లో నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 8,507 కోటి రూపాయలు చేయగా ఇంకా 1788 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.