గాంధీ ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులు కిక్కిరిసపో తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. 2వేల మందికి చికిత్స చేసే సామర్థ్యం కలిగిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నది 247 మంది మాత్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన వివరాలు వాస్తవానికి అతి దూరంగా ఉన్నట్టు తేలుతోంది. కరోనా విషయంలో అంతా తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ హైకోర్టు మండిపడిన నేపథ్యంలో కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి మరీ కరోనా రోగుల గణాంకాలను విడుదల చేశారు.
నిజానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలాలేదు. ప్రస్తుతం తెలంగాణలో.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారమే ప్రస్తుతం 2,030 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో గాంధీతోపాటు ఛాతీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స జరుగుతోంది. ఈ మూడింటిలో కూడా గాంధీ ఆస్పత్రిలోనే ఎక్కువ మంది బాధితులున్నారు. కానీ సీఎం మాత్రం 247 మంది మాత్రమే ఉన్నారని చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.పైగా ముఖ్యమంత్రి ఈ వివరాలు చెప్పిన రోజే ఒక్క గాంధీ ఆస్పత్రి నుండే 393మంది కరోనా రోగులను డిశ్చార్జి చేశారు.
అసలు గాంధీ ఆసుపత్రిలో ఉన్న కరోనా రోగులు కేవలం 247 మంది మాత్రమే మాత్రమేనని సిఎం చెబితే అదే రోజు 393 మందిని అదే ఆసుపత్రినుండి డిస్చార్జి చేయడాన్ని బట్టే ముఖ్యమంత్రి వాస్తవాలు దాస్తున్నట్లు స్పష్టమైంది.వీరందరికీ కరోనా తగ్గకపోయినా.. బెడ్ల కొరత దృష్ట్యానే వారిని డిశ్చార్జి చేసినట్లు సమాచారం.ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గాంధీ ఆసుపత్రి విషయంలో తీవ్రంగా స్పందించనున్నట్లు కూడా వైద్య శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ సంగతి అలా ఉంచితే.. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీకి వెళ్లడం అంటే శ్మశానానికి వెళ్లడమే అంటూ ఇటీవల చనిపోయిన జర్నలిస్టు మనోజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మనోజ్ ను సరిగా పట్టించుకోవడంలేదని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చాయి.తాజాగా ఓ ఛానల్ కు చెందిన కెమెరామెన్ కూడా గాంధీలో పరిస్థితిని ఏకరువు పెట్టాడు.మొత్తం మీద గాంధీ ఆసుపత్రిలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని కప్పి పుచ్చే. ధోరణిలో సాగుతున్నారు.