ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిన సంగతి తెలిసిందే. గోదావరి వరదల కారణంగా తెలంగాణ, ఏపీలో నదీ పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురైంది. వరద ముంపు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి వరదల కారణంగా ఏపి, తెలంగాణలో ప్రజలకు, వారి జీవనోపాధికి జరిగిన నష్టం గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వివరించారు. దీనిపై అమిత్ షా వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వీలయినంత త్వరగా అందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే తెలంగాణలో అవసరమైన రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహేంచేందుకు గానూ 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం జరిగిందని అమిత్ షా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేటాయించినప్పటికీ మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన విజ్ఞాపన పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదని కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ పత్రాలను పంపిన వెంటనే అవసరమైన అన్న రకాల సహకారాన్ని అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఏపి రాష్ట్రానికి సంబంధించిన ఇప్పటికే మొదటి విడత నిధులను ఎన్డీఆర్ఎఫ్ నుండి విడుదల చేయడం జరిగిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపిందన్నారు. ఏపి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే రెండో విడుత నిధులకు సంబంధించి కేటాయింపులు జరిపి, నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి ప్రాధమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ బృందాలను పంపి జరిగిన నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిద్దంగా ఉన్నట్లు మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గోదావరి మహోగ్రరూపం .. 24లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి